తెలంగాణలో మే నెల సాయం రూ. 1500 జమ
లాక్ డౌన్ అమలులో ఉన్న కారణంగా తెలంగాణలోని తెల్లరేషన్కార్డు దారులకు సీఎం కేసీఆర్ ప్రకటించిన రెండో విడత రూ. 1500 నగదు బ్యాంకు ఖాతాల్లోకి జమ చేసే ప్రక్రియ మొదలైంది. శనివారం లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసినట్టు పౌరసరఫరాలసంస్థ ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాస్రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో అర్హులైన వారందరికీ 1500 పంపిణీ చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. 74.35 లక్షల మంది లబ్ధిదారులకు 1500 చొప్పున 1,115 కోట్లను శనివారం బ్యాంకుల్లో జమ చేశామని వివరించారు. బ్యాంకు ఖాతాలేని 5.38లక్షల మంది లబ్ధిదారులకు పోస్టాఫీసు ద్వారా రానున్న మూడు రోజుల్లో ఈ మొత్తాన్ని అందిస్తామని అన్నారు.
రెండో విడత బియ్యం పంపిణీలోనూ ఇప్పటికే 9లక్షల మంది 37వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని తీసుకున్నారని ఆయన తెలిపారు. లబ్ధిదారులు ఎలాంటి ఆందోళనకు గురికావద్దని మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. లబ్ధిదారులు సామాజిక దూరం పాటిస్తూ బ్యాంకులు, పోస్టాఫీసుల వద్ద నగదును పొందాలని సూచించారు. గత నెల 23 వరకూ రేషన్బియ్యం పంపిణీ చేసినట్టుగానే... ఈ నెల కూడా ప్రతి ఒక్కరికీ రేషన్ అందే వరకూ షాపులు తెరిచి ఉంటాయని ఆయన స్పష్టం చేశారు.