ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల షెడ్యూల్ విడుద‌ల‌



క‌రోనా వైర‌స్, లాక్ డౌన్ కార‌ణంగా రాష్ట్రంలో వాయిదా ప‌డిన‌ పదో తరగతి పరీక్షలను జూన్ 8 నుంచి నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. జూన్ మొదటి వారంలో పరీక్షలు నిర్వ‌హించుకోవ‌చ్చని తెలంగాణ హైకోర్టు ఆదేశించిన నేప‌థ్యంలో రాష్ట్ర విద్యాశాఖ ప‌రీక్ష‌ల షెడ్యూల్‌ను శుక్రవారం విడుదల చేసింది. జూన్‌ 8 నుంచి జూలై 5వ తేదీ వరకు పరీక్షలు జరుగనున్నాయి. పరీక్షలన్నీ ఉదయం 9.30 నుంచి మధ్యాహం 12.15 గంటల వరకు జరుగనున్నాయి. హైకోర్టు ఆదేశాల మేరకు ప్రతిపరీక్షకు రెండు రోజుల వ్యవధి వచ్చేలా షెడ్యూల్‌ను రూపొందించారు. అలాగే కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో విద్యార్థులందరూ భౌతిక దూరం పాటించేలా పరీక్ష హాల్లో చర్యలు తీసుకోనున్నారు.
జూన్ 8న ఇంగ్లీష్ పేపర్, 11న ఇంగ్లీష్ పేపర్ 2, 14న మ్యాథ్స్ పేపర్ 1, 17న మ్యాథ్స్ పేపర్ 2, 20న సైన్స్ పేపర్ 1, 23న సైన్స్ పేపర్ 2, 26న సోషల్ స్టడీష్ పేపర్ 1, 29న సోషల్ స్టడీష్ పేపర్ 2 నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కరోనా నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకుని ఈ పరీక్షలు నిర్వహిస్తామని తెలంగాణ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది.
  • రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆదేశాలకు అనుగుణంగా, కోవిడ్-19 నిబంధనలకు లోబడి జూన్8 వ తేదీ నుండి పదవ తరగతి పరీక్షలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు విద్యాశాఖ మంత్రిపి. సబితా ఇంద్రారెడ్డి గారు వెల్లడించారు.

  • ప్రతీ పరీక్షకు రెండు రోజుల వ్యవధినిస్తూ ఈ పరీక్షలను జూన్8 వ తేదీ నుండి జూలై 5 వ తేదీ వరకు నిర్వహించబోతున్నామని తెలిపారు. కరోనా నేపథ్యంలో మార్చిలోజరగాల్సిన పదవ తరగతి పరీక్షలను రాష్ట్ర ఉన్నత న్యాయస్థానము ఆదేశాలతో గతంలో వాయిదా వేయడం జరిగిందని, ప్రస్తుత పరిస్థితులలో పరీక్షల నిర్వహణకు ఉన్నత న్యాయస్థానం అంగీకరించడంతో ఏర్పాట్లుచేపట్టామని తెలిపారు.

  • పరీక్షా కేంద్రాల్లో విద్యార్థుల భౌతిక దూరాన్ని పాటించాలన్న ఉన్నత న్యాయస్థానము సూచనలకు అనుగుణంగా ప్రస్తుతం ఉన్న 2,580 పరీక్షా కేంద్రాలకు అదనంగా మరో 2,005 కేంద్రాలనుఏర్పాటు చేసినట్లు మంత్రి వివరించారు.

  • ఇందుకోసం అదనంగా 26,422 మంది ప్రభుత్వ సిబ్బంది సేవలను వినియోగించుకోబోతున్నామని వెల్లడించారు.

  • గతంలో కేటాయించిన పరీక్షా కేంద్రాల భవనాల్లోనూ, గతంలో కేటాయించిన పరీక్షా కేంద్రానికి అర కిలోమీటర్ లోపలే నూతన పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు. 

  • పరీక్షా కేంద్రాల మార్పును వారి సంబంధిత ప్రధానోపాధ్యాయులు, చీఫ్ సూపరింటెండెంట్ ద్వారా తెలియజేస్తామని మంత్రి వివరించారు. 

  • పరీక్షా కేంద్రాలను ప్రతిరోజూ శానిటైజ్ చేయడంతో పాటు విద్యార్థులకు మాస్కులను అందజేస్తామని, థర్మల్ స్క్రీనింగ్ చేసిన తరువాతే పరీక్షా కేంద్రం లోపలికి అనుమతిస్తామని మంత్రి తెలిపారు.

  •  ప్రతి బెంచిపై ఒకరు మాత్రమే కూర్చునే విధంగా ఏర్పాట్లుచేస్తున్నామనిఅన్నారు.

  • పరీక్షా కేంద్రంలోకి ప్రవేశించడానికి గంట ముందే అనుమతిస్తున్నామని, విద్యార్థులు కూడా పరీక్షా కేంద్రానికి ముందే వచ్చే విధంగా ఏర్పాట్లు చేసుకోవాలని కోరారు.

  • కోవిడ్ -19 నేపథ్యంలో విద్యార్థులకు ఎలాంటి ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తకుండా తల్లిదండ్రులు కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.

  • పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు సకాలంలో చేరుకునేందుకు వీలుగా అవసరమైన ప్రత్యేక బస్సులను ఆర్టీసి నడుపుతుందని మంత్రి తెలిపారు. 

  • ఈ పరీక్షలకు సంబంధించి ఏవైనా సలహాలు, సూచనలు కావాలనుకొనే విద్యార్థుల తల్లిదండ్రుల కోసం హెల్ప్ లైన్ ను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.

  • పరీక్షకుహాజరయ్యే విద్యార్థి ఎవరైనా దగ్గు, జలుబు, జ్వరంతో ఉన్నట్లయితే వారిని ప్రత్యేక గదుల్లో ఉంచి పరీక్ష రాయించనున్నట్లు వివరించారు. ఎవరైనా ఇన్విజిలేటర్లకు దగ్గు, జలుబు, జ్వరం ఉన్నట్లయితే వారిని విధులనుండి తప్పించి రిజర్వులో ఉన్నవారితోపరీక్షలనునిర్వహిస్తామని అన్నారు.

  • పరీక్షా కేంద్రాల్లో విధులను నిర్వర్తించే సిబ్బంది ప్రత్యేకంగా మాస్కులను ధరించడంతో చేతులకు గ్లోజ్ లను కూడా ధరించే విధంగా ఏర్పాట్లు చేసినట్లు మంత్రి తెలిపారు. 

  • పరీక్షా తేదీలు ఖరారైనందున విద్యార్థులు పరీక్షలకు సిద్ధమవ్వాలని, ఎలాంటి ఆందోళన చెందవద్దని, ప్రభుత్వం అన్ని జాగ్రత్త చర్యలు తీసుకొని పరీక్షలను నిర్వహిస్తుందని భరోసా ఇచ్చారు.

Popular posts from this blog

దేశవ్యాప్తంగా 170 హాట్‌స్పాట్‌ జిల్లాలు: కేంద్రం

చరిత్రలో ఈ రోజు 21 మే 2020

🌏 చరిత్రలో ఈరోజు ఏప్రిల్ 28